
పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఎన్టీఆర్ ఘనతే
దామచర్ల ఆంజనేయులు ఈ ప్రాంతానికి చేసిన సేవలు చిరస్మరణీయం
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సుస్థిర కాలం ఉండాలి
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
ఎన్టీఆర్ అనేది మూడక్షరాల పేరు కాదు అది తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం జరుగుమల్లి మండలం దావగూడూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి డా. స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ అనంతరం పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో మంత్రి డిఎస్ బీవీ స్వామి మాట్లాడుతూ…..ఎన్టీఆర్ అనేది మూడక్షరాల పేరు కాదు అది తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక.తెలుగు జాతి శక్తిని దశ దిశలా చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్. విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి పధకాలు తీసుకొచ్చి పేదల గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ .పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్ పాలనలో తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్న ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు.తెలుగుజాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది. ఆంజనేయులు ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయం.
ఈ ప్రాంతంలో దామచర్ల ఆంజనేయులు చేసిన అభివృద్ధి నేటికీ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. కొండపి నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని సులభతరం చేశారు. ఈ ప్రాంతంలో దశాబ్దాల తరబడి ఉన్న సమస్యలకు దామచర్ల ఆంజనేయులు పరిష్కారం చూపించారు. ఈ ప్రాంత ప్రజల గుండెల్లో పెద్దాయనగా దామచర్ల ఆంజనేయులు చిరస్థాయిగా నిలిచిపోయారు.సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలకనుగుణంగా పాలన సాగిస్తూ.. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. వెలిగొండ పూర్తికాకుండానే జాతికి అంకితం చేసి జగన్ ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ద ప్రాతిపదికన వెలుగొండ పనులు పూర్తి చేసి ఈనెలాఖరులో ప్రారంభిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ హామీలన్నీ అమలు చేస్తున్నాం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సుస్థిర కాలం ఉండాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.