
తొలి శుభోదయం న్యూస్ పొదిలి:-
మార్కాపురం జిల్లా పొదిలి మట్టికి జాతీయ స్థాయిలో అరుదైన పురస్కారం దక్కింది. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ కమాండెంట్ సయ్యద్ మహబూబ్ బాషాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ పురస్కారానికి ఎంపిక చేసింది.
విధి నిర్వహణలో ఆయన కనబరిచిన నిష్కళంకమైన నిజాయితీ, అసాధారణమైన కర్తవ్య నిష్ట మరియు వృత్తిపరమైన నైపుణ్యాలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
1998లో పోలీస్ శాఖలో అడుగుపెట్టిన మహబూబ్ బాషా నాటి నుండి నేటి వరకు వివిధ హోదాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజా రక్షణకు నిరంతరం శ్రమించారు. ప్రస్తుతం ఏపీ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ కమాండెంట్గా విధులు నిర్వహిస్తూ, నూతనంగా ఎంపికైన పోలీస్ అధికారులకు ఉన్నతమైన శిక్షణ అందించడంతో పాటు పరిపాలనా అంశాలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నారు.
సుదీర్ఘమైన 28 ఏళ్ల ఆయన సేవలు, నాయకత్వ పటిమకు ఈ జాతీయ పురస్కారం మకుటాయమానంగా నిలిచింది. మహబూబ్ బాషాకు ఈ అత్యున్నత గౌరవం లభించడం పట్ల ఆయన స్వస్థలమైన పొదిలి గ్రామ ప్రజలతో పాటు ఏపీ పోలీస్ శాఖ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.