
మరణించిన సహోద్యోగి కుటుంబానికి తోటి బ్యాచ్ పోలీసులు అండగా నిలవడం అభినందనీయం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ, తేదీ 12.07.2026న ఉదయం ఒంగోలు టౌన్లోని పద్మ టవర్స్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ మరియదాసు (AR PC-3891, 35 సం.) గారి కుటుంబ సభ్యులకు 2013 బ్యాచ్కు చెందిన ఎఆర్ పోలీస్ సిబ్బంది తమ వంతు సహాయంగా సేకరించిన మొత్తం రూ.2,02,000/- నగదును మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పోలీస్ శాఖ వారికి అండగా ఉంటుందని, ఏదైనా సమస్య ఉన్న నేరుగా తనను కలవవచ్చని ఎస్పీ గారు తెలిపారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటూ, వారికి అండగా ఉంటామని ఎస్పీ గారు అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ సహోద్యోగి కుటుంబానికి 2013 బ్యాచ్కు చెందిన తోటి బ్యాచ్ పోలీసులు తమ వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలవడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, 2013 బ్యాచ్కు చెందిన తోటి పోలీసులు రామకృష్ణ, హరిప్రసాద్, వెంకట నాయుడు, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.