
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రభుత్వ సంక్షేమ విద్యాసంస్థలను నిత్యం పచ్చదనంతో శోభిల్లేలా చేస్తూ, విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన మరియు పర్యావరణ హితమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు తెలిపారు.ఆదివారం సింగరాయకొండ మండలం, సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో "నెట్ జీరో హెల్త్ క్యాంపస్" కార్యక్రమంలో భాగంగా చేపట్టిన "అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ (అనంత అరణ్య మోడల్)" నాటడం కార్యక్రమాన్ని మంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా గౌరవ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతూ
"పాఠశాలలు కేవలం చదువు చెప్పే కేంద్రాలుగానే కాకుండా, విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడే పచ్చని నిలయాలుగా మారాలన్నారు.. 'నెట్ జీరో హెల్త్ క్యాంపస్' విధానం ద్వారా ప్రతి గురుకులాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. అతి తక్కువ స్థలంలో, తక్కువ సమయంలోనే దట్టమైన అడవిని తలపించేలా రూపుదిద్దుకునే ఈ 'అనంత అరణ్య మోడల్ (అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్)' ద్వారా క్యాంపస్లో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి విద్యార్థులకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది మంత్రి అన్నారు.
మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీసుకోవాలని ,చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై పిల్లల్లో అవగాహన పెంచినప్పుడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారన్నారు. గురుకుల విద్యాలయాలలో మౌలిక వసతులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందిని మంత్రి తెలిపారు.