
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
వైసీపీ నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లు వీపీఆర్ దంపతులపై చేస్తున్న ఆరోపణలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకే వైసీపీ నేతల కట్టుకథలను ప్రజల ముందు పెడుతున్నామని తెలిపారు.2019 ఎన్నికల అనంతరం అనిల్ కుమార్ యాదవ్ తమను ఆశ్రయించి సహాయం కోరిన విషయాన్ని గుర్తుచేస్తూ, నేడు అదే వ్యక్తి వీపీఆర్పై ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.రూ.50 వేల కోట్ల విలువైన అధికారిక వ్యాపారాలు ఉన్న వీపీఆర్కు అక్రమ దందాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నెల్లూరు యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో క్వార్ట్జ్ పరిశ్రమలో అడుగుపెట్టి, రాజకీయ రాద్ధాంతం ఇష్టం లేక 2025లోనే ఆ భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చామని తెలిపారు.మైనారిటీల సంక్షేమానికి వీపీఆర్ దంపతులు అందిస్తున్న సహాయాన్ని వివరించిన ఆమె, వైసీపీ నేతలకు మైనారిటీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.ప్రసన్నకుమార్ రెడ్డి హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ మైనింగ్పై ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయని, నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు.కోవూరులో ప్రస్తుతం అవినీతికి తావులేదని, నిబంధనల ప్రకారమే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ నేతల అసత్య ప్రచారాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు హెచ్చరించారు.