
సీనియర్ సివిల్ జడ్జి కే.కే.వి. బుల్లి కృష్ణ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
జాతీయ మెగా లోక్ అదాలత్ స్థానిక కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణము నందు మండల లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగినది. ఈ లోక్ అదాలత్ ను సీనియర్ సివిల్ జడ్జి కె. కె. వి.బి. కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశానుసారం ఈరోజు నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారులు వీలైనంత వరకు కేసులు రాజీ చేసుకోవాలని కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ శ్రీ కే.కే.వి.బి కృష్ణ గారు సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల విలువైన సమయంతో పాటు ధనం ఆదా అవుతుందని, ఇరు పార్టీల మధ్య స్నేహ సంబంధ వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని రకాల సివిల్ కేసులు భరణం, గృహహింస, చెక్ బౌన్స్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు, కోర్టు మెట్లు ఎక్కని ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చు అని వివరించారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి.దుర్గా కళ్యాణి గారు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎల్.అన్నపూర్ణ గారు,కందుకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీధర్ నాయుడు సీనియర్ జూనియర్ న్యాయవాదులు, MLSC సభ్యులు, పోలీసు సిబ్బంది, కక్షిదారులు,బ్యాంక్, మున్సిపల్, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.