
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సబ్డివిజన్ పరిధిలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా డీఎస్పీ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ ప్రత్యేక తనిఖీలు బాలిరెడ్డి నగర్ మరియు పొతుల చెంచయ్య కాలనీ ప్రాంతాలలో కట్టుదిట్టంగా చేపట్టారు.ఈ ఆపరేషన్లో సింగరాయకొండ సబ్డివిజన్ అధికారులతో పాటు ఒంగోలు సర్కిల్ ఇన్స్పెక్టర్, టంగుటూరు, జారుగుమల్లి, ఒంగోలు వన్టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు మరియు సుమారు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, పాత నేరస్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతి ఇంటిని తనిఖీ చేసి పూర్తి స్థాయిలో పరిశీలనలు చేపట్టారు.ప్రజల భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ తరహా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతూ నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.పోలీసులు ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నారని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
