
పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులకు ఎంఈవో భరోసా
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
మార్కాపురం జిల్లా కంభం మండలం: పరీక్షల్లో ఫెయిల్ ఐన విద్యార్థులు నిరుత్సాహపడకుండా, తిరిగి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఎంఈవో అబ్దుల్ సత్తార్ అన్నారు. గురువారం స్థానిక అర్బన్ కాలనీ,పూసల బజార్,నాయక్ వీధిలో 10వ తరగతి ఫెయిలయిన విద్యార్థుల ఇంటింటికి తిరిగి అవగాహన కలిగించారు.పాఠశాలలో నిర్వహించే రెమెడియల్ తరగతులకు 10వ తరగతి ఫెయిల్ ఐన విద్యార్థులు అందరూ హాజరుకావాలని,తద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఎస్సీ ఫెయిల్ కావడం విద్యా ప్రయాణానికి ముగింపు కాదని, పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని హితవు పలికారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రెమెడియల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించి, చదువుపై ఆసక్తి పెంచేలా సహకరించాలన్నారు. మండలంలోని ఉన్నత పాఠశాలల్లో రెమెడియల్ తరగతులు సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.