
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో భారత్ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి నెల రోజులు గడిచినా ఇప్పటికీ డెలివరీ కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ వంట అవసరాల కోసం గ్యాస్పై ఆధారపడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.వినియోగదారులు గ్యాస్ కార్యాలయానికి వెళ్లి వివరాలు అడిగితే “ఇంకా రెండు రోజులు ఆగండి” అంటూ సమాధానం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ వెళ్లినా అదే సమాధానం వస్తోందని ప్రజలు వాపోతున్నారు. దీంతో గ్యాస్ కార్యాలయం వద్ద నిత్యం వినియోగదారులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది.ప్రత్యేకించి చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్యాస్ సరఫరాలో జాప్యానికి గల అసలు కారణాలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో వినియోగదారుల్లో మరింత అసంతృప్తి పెరుగుతోంది. సమస్యను వెంటనే పరిష్కరించి, పెండింగ్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను త్వరితగతిన పంపిణీ చేయాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.