
తొలి శుభోదయం న్యూస్ :-
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.
సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ.. జూబ్లీహిల్స్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మోదీని సాదరంగా ఆహ్వానించారు. ఆనంతరం 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ నివాసంలో మోదీ ఉన్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ.. సరైన విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.మరోవైపు పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి ప్రధాని మోదీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్ పక్కన బెట్టి మరీ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లటం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ప్రధాని మోదీ ఇలాంటి అధికారిక కార్యక్రమాలకు వెళ్లినప్పుడు.. రాజకీయ నేతల ఇళ్లకు వెళ్లటం చాలా అరుదు.అయితే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ప్రాబల్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నివాసాలకు వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పే వ్యూహంలో భాగంగానే ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లినట్లు విశ్లేషణలకు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసేందుకు, కొత్త భాగస్వామ్యులను ఆకర్షించే ప్రయత్నమనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఇళ్లకు వెళ్లటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.