
అసత్య వదంతులను వ్యాప్తి చేసిన, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు వ్యాప్తి చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం
ఏదైనా సమాచారాన్ని ఫార్వార్డ్ చేసే ముందు దాని వాస్తవికతను ధృవీకరించుకోవాలి
అభ్యంతరకరమైన లేదా రెచ్చగొట్టే కంటెంట్ను ఎవరైనా పోస్ట్ చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటాం
అటువంటి వారిని గ్రూప్ నుండి తొలగించి పోలీస్ వారికి సమాచారం ఇవ్వవలసిన బాధ్యత అడ్మిన్ పై ఉంటుంది
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల పోలీస్ :-
సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య వదంతులను, వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా లేదా వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపిఎస్ గారు హెచ్చరించారు. బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు జాగ్రత్ర చర్యలలో భాగంగా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫారమ్లలో వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసేలా సందేశాలు పంపడం, ఫోటోలు లేదా వీడియోలను మార్ఫింగ్ చేసి షేర్ చేయడం చట్టరీత్యా నేరమని ఎస్పీ గారు స్పష్టం చేశారు. సమాజంలోని ప్రజల మధ్య సామరస్యం పెంపొందాలన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతూ ఇతరుల మనోభావాలను గౌరవించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు సూచించారు. తమ గ్రూపుల్లో ఎవరైనా అభ్యంతరకరమైన లేదా రెచ్చగొట్టే కంటెంట్ను పోస్ట్ చేస్తే, అడ్మిన్లు వెంటనే స్పందించి ఆ సందేశాలను తొలగించడంతో పాటు సంబంధిత వ్యక్తులను గ్రూప్ నుండి తొలగించలన్నారు. లేనిపక్షంలో, గ్రూప్లో జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్మిన్లను కూడా బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వదంతుల పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని, ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్ చేసే ముందు దాని వాస్తవికతను అధికారిక మూలాల ద్వారా ధృవీకరించుకోవాలని తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం వల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఎవరైనా అసత్య ప్రచారాలు, వర్గాలు, మతల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టల్ చేస్తే వారిపై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.జిల్లాలో ఎక్కడైనా అసత్య ప్రచారాలు, వర్గాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గమనిస్తే, వెంటనే దగ్గరలోని పోలీసులకు లేదా 112 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.