
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా వాహన తనిఖీలు నిర్వహించి, 236 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం& మార్కాపురం పోలీస్:-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ను ముమ్మరం చేశారు. నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ప్రత్యేకంగా వాహన తనిఖీలను కూడా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.రాత్రి సమయంలో అనవసరంగా మరియు అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేసి, వాటి రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర రికార్డులను పరిశీలించారు. సరైన పత్రాలు లేని లేదా రోడ్డు/ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు చేపట్టారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 780 వాహనాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 103 వాహనాలను స్వాధీనం చేసుకొని సంబంధిత పోలీసు స్టేషన్లకు తరలించారు. అదేవిధంగా మార్కాపురం జిల్లా వ్యాప్తంగా 552 వాహనాలను తనిఖీ చేసి, 133 వాహనాలను స్వాధీనం చేసుకొని సంబంధిత పోలీసు స్టేషన్లకు తరలించారు.నిర్ణిత సమయం దాటి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు, రాత్రి సమయంలో మరోసారి అనవసరంగా రోడ్లపై తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సంబంధిత వాహనాల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ఈ-చలానాలు విధించారు.నేర నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే దిశగా ప్రతిరోజూ నైట్ పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేస్తున్నారు. దొంగతనాలు మరియు ఇతర నేరాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.పోలీస్ సిబ్బంది నుండి ఎస్సైలు, సి.ఐలు, డీఎస్పీలు వరకు రాత్రి వేళ గస్తీ విధులు నిర్వహిస్తూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బీట్ అధికారులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రవాణా వివరాలు సేకరించడంతో పాటు కొత్త వ్యక్తుల వివరాలను ఆరా తీసి, అక్రమ కార్యకలాపాలను అరికట్టే చర్యలు చేపడుతున్నారు. బీట్ పాయింట్లను తరచూ తనిఖీ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్కడ ఉండే వారి ఆధార్ వివరాలను పరిశీలించాలన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు మరియు చెడునడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, మొబైల్ చెక్ డివైసుల ద్వారా తనిఖీ చేస్తున్నారు. దేవాలయాలు, ఎటిఎంలు మరియు ముఖ్య వ్యాపార కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు.రాత్రి వేళల్లో అల్లర్లు, గొడవలు, దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, కారణం లేకుండా తిరిగే ఆకతాయిలపై మరియు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.