
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
జిల్లాలో గ్రామస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ముఖ్యంగా కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు రావడంతో కలెక్టర్ తో పాటు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, కింది స్థాయి
అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. శుక్రవారం రాత్రి అన్ని జిల్లాల కలెక్టర్ తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుండమాల గ్రామానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు రావడంతో ఇదే ఉత్సాహంతో మరింత దృష్టి పెట్టి ఇతర గ్రామాలను కూడా అభివృద్ధి బాట పట్టించాలని కలెక్టర్ కు ఆయన సూచించారు. ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే ' స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ' కార్యక్రమంలో ఈనెల 16వ తేదీన ' ప్లాస్టిక్ రహిత రాష్ట్రం ' అనే ఇతివృత్తంతో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చినందున ఇళ్ళు, పరిసరాల శుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పి సీఈవో చిరంజీవి, డ్వామా పిడి జోసఫ్ కుమార్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.