
పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి
విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకోవాలి
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ కొండేపి :-
పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ. 95 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి మంత్రి డా. స్వామి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. యువతకు విద్యతోపాటు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్ ఫ్రం హోం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకోవాలి. ప్రతి విద్యార్థి పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకోవాలి. విద్యార్థుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.