
నేరాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రకాశం పోలీసుల విస్తృత తనిఖీలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు గారి అధ్వర్యంలో ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి, సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబుతో పాటు ఒంగోలు సబ్ డివిజన్ 4 మంది ఎస్సైలు , 45 మంది పోలీస్ సిబ్బంది సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మాలపాడులోని SC కాలనీ మరియు పాముల కాలనీ మరియు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనం,రెండు ఆటో లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు క్రికెట్ బెట్టింగ్ల వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించారు. బెట్టింగ్లకు పాల్పడడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు విద్యాభ్యాసంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. తక్కువ సమయంలో అధిక ఆదాయం సంపాదించాలనే ఆశతో కొందరు యువత క్రికెట్ బెట్టింగ్ల వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల బానిసత్వం ఆర్థిక, కుటుంబ పరమైన సమస్యలకు దారితీస్తుందని, మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, బాలికల భద్రత, చట్టాలు మరియు శిక్షలపై అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా ఓటీపీలు చెప్పమని మోసపూరితంగా డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.ఆధార్ కార్డులను అపరిచితులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసి సిమ్ కార్డులు తీసుకుని నేరాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి మోసాలు చేసే వ్యక్తులు సమాజంలో పెరుగుతున్నారని, అలాంటి వారిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ప్రజలతో కలిసి “మత్తుకు దూరంగా ఉండాలి – మత్తు లేని సమాజాన్ని నిర్మిద్దాం” అనే ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు.ఈ తనిఖీలో మద్దిపాడు ఎస్సై వెంకటసూర్య,NG పాడు ఎస్సై మహేంద్ర,జరుగుమల్లి ఎస్సై భాగ్యరాజు,ఒంగోలు తాలూకా ఎస్సై ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
