
అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు: -
పేదల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం ఒంగోలులోని సంతపేటలో రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న ఎస్సి గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పనులు మంత్రి డిఎస్ బీవీ స్వామి పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని మంత్రి అధికారులకు సూచించారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పీఎం అజయ్ కింద రూ. 86 కోట్లతో రాష్ట్రంలో 25 నూతన హాస్టళ్లు నిర్మిస్తున్నాం. సాస్కి నిధులు రూ. 200 కోట్లతో రాష్ట్రంలోని హాస్టళ్లకు మరమ్మతులు, అదనపు భవనాలు నిర్మిస్తున్నాం. రూ.143 కోట్లతో 700 హాస్టళ్లకి మరమ్మతులు చేశాం. రూ. 58 కోట్లతో అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో అదనపు మరుగుదొడ్లు నిర్మించాం. ఒంగోలులో దివ్యాంగ విద్యార్థుల కోసం రూ.3 కోట్లతో ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తున్నాం. త్వరలోనే మెస్ చార్జీలు పెంచుతాం. తిరుపతి, విజయవాడ, విశాఖ స్టడీ సర్కిళ్లలో 450 మందికి ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇస్తున్నాం. వీటితో పాటు ఒంగోలు, అమలాపురంలో నూతనంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తాం. 250 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ భాషలో ఉచిత శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టాం. పేదల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం. అందుకనుగుణంగా ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లను 3 నుంచి 13 కి పెంచాం. మరో 12 పెంచి 25 జిల్లాలకు 25 ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
