
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి కల్పన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ఆసక్తికరమైన బోధనా పద్ధతులను అనుసరించాలని సూచించారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని పాఠశాలలకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు అందజేస్తామని తెలిపారు. గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలులో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.అనంతరం శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి, వారు రూపొందించిన టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం)లను పరిశీలించారు. శిక్షణా కేంద్రంలో కల్పించిన వసతులు, భోజన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కోర్స్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాసరావును అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఎంఓ నాగేంద్ర నాయక్, జిల్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్ మసనం జాలరత్నం, ప్రథమ్ పరిశీలకులు రవిచంద్ర, మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు, కేఆర్పీలు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, డీఆర్పీలు బీసాబత్తిన శ్రీనివాసరావు, కీర్తి శ్రీనివాసరావు, రమణారెడ్డి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ శిక్షణా కార్యక్రమంలో 140 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్నారు.