
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి కుంభజడల రామమూర్తి (84) ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.రామమూర్తి ఇరిగేషన్ శాఖలో ఇంజినీర్గా సేవలందించి పదవీ విరమణ అనంతరం హైదరాబాద్లో నివసిస్తున్నారు.వృద్ధాప్య కారణాలతో పాటు గుండెపోటుకు గురై ఆయన తుదిశ్వాస విడిచారు.తండ్రి మృతదేహాన్ని జస్టిస్ మన్మథరావు సోమవారం రాత్రి సింగరాయకొండకు తరలించారు. కందుకూరు రోడ్డులోని వారి నివాసంలో మంగళవారం రోజు ప్రజలు, బంధువులు, న్యాయవాదులు మరియు శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.జస్టిస్ మన్మథరావుకు పితృవియోగం కలగడంతో ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సింగరాయకొండ సివిల్ జడ్జి, పలువురు న్యాయమూర్తులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, కందుకూరు మరియు ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా న్యాయవాదులు, బంధువులు, స్నేహితులు రామమూర్తి మృతదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామమూర్తి మరణం పట్ల న్యాయ, సామాజిక వర్గాల్లో విషాదం నెలకొంది.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని పలువురు ఆకాంక్షించారు.
