తొలి శుభోదయం ఆంధ్రప్రదేశ్:-

ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, రక్షణ తయారీ రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చొరవ చూపి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పిస్తూ, రాష్ట్ర అభివృద్ధి, దేశ రక్షణ బలోపేతానికి ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమన్నారు.రాష్ట్రంలో ప్రతిపాదిత దొనకొండలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ స్థాపన, నెల్లూరులో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ (యుఏడిఎన్ఎల్) అల్యూమినియం అలాయ్ ప్లాంట్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళాలని, అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎమ్ సిఎ) లైట్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, విశాఖపట్నం సమీపంలో నౌకాదళ పరికరాలు, ఆయుధాల పరీక్షా కేంద్రం వంటివి చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు, రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన తయారీ హబ్‌లను కలుపుతూ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, స్వదేశీ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడం, రాష్ట్రంలో ఏరోస్పేస్ రక్షణ తయారీ హబ్‌ల అభివృద్ధి, ఇందులో ఐఐటి తిరుపతిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ–అకాడెమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన, సాధారణ ఆయుధ నిల్వ విధానం రూపకల్పనలో చొరవ చూపాలన్నారు. ఈ ప్రాజెక్టులకు త్వరిత ఆమోదాలు లభిస్తే ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాల సాధనకు తోడ్పడటంతో పాటు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, దేశ రక్షణ స్వావలంబనకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *