తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపటంపై కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా, కందుకూరు ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పునర్విభజన కమిటీ సభ్యులకు కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలు, ఆశలకు అనుగుణంగా తాము చేసిన పోరాటం ఫలించిందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. కందుకూరు చరిత్రలో ఇది మరిచిపోలేని అధ్యాయమని తెలిపారు. డిసెంబర్ 31న కందుకూరు నియోజకవర్గంను ప్రకాశం జిల్లాలో కలుపుతూ గెజిట్ విడుదలవుతుందని ఎమ్మెల్యే వివరించారు. కందుకూరు నియోజవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని, అదే సమయంలో తోటివారికి ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. కందుకూరు పట్టణంలో 5.43 కోట్ల రూపాయలతో రోడ్ల వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు తెలిపారు. గుడ్లూరు రోడ్డు, సింగరాయకొండ రోడ్డులో త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. తర్వాత కోవూరు రోడ్డు, కనిగిరి రోడ్డులో ఈ పనులు మొదలవుతాయన్నారు. కందుకూరు పట్టణంలో అభివృద్ధి పనుల కోసం మరో 5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపగా, త్వరలో నిధులు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. తన చిన్న కుమారుడు సందీప్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 4వ తేదీన కందుకూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. గుంటూరు శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని, గుంటూరు వారి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందిస్తామని చెప్పారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల టిడిపి అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, నెల్లూరు పార్లమెంటు పార్టీ ఉపాధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *