తొలి శుభోదయం ప్రకాశం:-
సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించడంతో పాటు వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు పొన్నలూరు ప్రాంతంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ లేదా మెసేజ్ల ద్వారా “డిజిటల్ అరెస్ట్” అని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం పూర్తిగా మోసమని తెలిపారు. పోలీసులు ఎప్పటికీ ఈ విధంగా డిజిటల్ అరెస్ట్లు చేయరని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే స్పందించకుండా డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.అలాగే సీనియర్ సిటిజన్ చట్టాలు గురించి వివరించి, వృద్ధులకు చట్టం ద్వారా కల్పించిన హక్కులు, రక్షణ చర్యలు, సహాయం పొందే విధానాలపై అవగాహన కల్పించారు. వృద్ధులపై నిర్లక్ష్యం, వేధింపులు, ఆస్తి సంబంధిత సమస్యలు ఎదురైతే పోలీసులను లేదా సంబంధిత అధికారులను ఆశ్రయించాలని తెలిపారు.ప్రకాశం జిల్లా పోలీసులు సైబర్ నేరాల నివారణ, వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం నిర్వహిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.