తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా , సింగరాయకొండ మండలం, పాకల గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు గురువారం సాయంత్రం సందర్శించారు. అక్షరాలు దిద్దుతున్న మహిళలతో మాట్లాడి, వారి అభ్యాస సామర్ధ్యాన్ని తెలుసుకున్నారు. హాజరవుతున్న మహిళలు, బోధనా పద్దతులు, తరగతుల నిర్వహణ, హాజరు నమోదు తదితర అంశాలపై వాలంటీర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళ రోజుకు కనీసం ఒక్క గంట సమయం కేటాయించి చదవడం, వ్రాయడం నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యతా కార్యక్రమాన్ని చదువురాని వారి కోసం ఏర్పాటు చేసిందని, రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రాత్రి వేళల్లో చదువు కోడానికి ఒక చక్కని అవకాశం కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, ప్రతి ఒక్కరూ కనీస విద్యావంతులుగా ఎదగాలని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను కూడా అభ్యాసకులకు అందించడం జరిగిందని, దీని ద్వారా చదవడం, వ్రాయడం, చిన్న పరీక్షలు సులువుగా వ్రాసే ధైర్యం వస్తుందని అన్నారు. ఒక్క వారం రోజుల్లోనే కొన్ని మాటలు చదవడం, వ్రాయడం కూడా వస్తుందని, అందించిన పుస్తకాలు పూర్తయ్యే వరకు నేర్చుకుంటే అన్ని వస్తాయని ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా మీ ద్వారా చదివించడానికి చక్కని అవకాశం ఏర్పడుతుందని అన్నారు. సంతకం నేర్చిన మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తారని, కుటుంబ వ్యవహారాలను కూడా సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. జిల్లాలో లక్షా,29 వేల 497 మందిని ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు.