విద్యార్థులకు వసతి గృహాల్లో మెరుగైన సంక్షేమం, సౌకర్యాలు అందిస్తున్నాం
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
గుంటూరులో సామాజిక పరివర్తన బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి డా.స్వామి ఆకస్మిక తనిఖీ
తొలి శుభోదయం అమరావతి:-
బాలికల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత అంశాల్లో కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు గుంటూరులో సామాజిక పరివర్తన బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో వంటగది, మరుగుదొడ్లుతో పాటు ప్రాంగణమంతా మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థినిలతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి వారితో కలిసి భోజనం చేశారు. వసతి గృహంలో పరిశుభ్రత, పారిశుధ్యం మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…..పేద విద్యార్థుల సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విద్యార్థులకు వసతి గృహాల్లో మెరుగైన సంక్షేమం, సౌకర్యాలు అందిస్తున్నాం. పేద విద్యార్థుల సంక్షేమం ఆరోగ్యం భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు. బాలికల భద్రత, ఆరోగ్యంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే గళ్లా మాధవి, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కలెక్టర్ తమీమ్ అన్సారియా వసతిగృహం తనిఖీలో పాల్గొన్నారు.
