బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే మా ప్రధాన లక్ష్యం.
కొత్త జిల్లాలో ప్రజల సమస్యలకు మరింత చేరువైన పోలీస్ సేవలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 48 ఫిర్యాదులు
తొలి శుభోదయం ప్రకాశం:-
నూతనంగా ఏర్పాటు అయిన మార్కాపురం జిల్లాలో ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో, జిల్లా పోలీస్ కార్యాలయం, మార్కాపురంలో సోమవారం జిల్లా ఇన్చార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. కొత్త జిల్లా ఏర్పాటు అనంతరం మొట్టమొదటిసారిగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల యొక్క వ్రాతపూర్వక వినతులను ఎస్పీ గారు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు, మహిళల సమస్యలు, ఆర్థిక/భూ వివాదలకు సంబంధించిన పిర్యాదులు, గ్రామస్థాయిలో నెలకొన్న వివిధ సమస్యలను ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులకు న్యాయం జరిగే విధంగా, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ అన్నారు. అందిన ప్రతి ఒక్క ఫిర్యాదుపై సంబంధిత అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్య తీవ్రతను బట్టి వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, నిర్ణీత గడువులో పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, సంఘటన స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. కొత్తగా ఏర్పాటు అయిన మార్కాపురం జిల్లాలో ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, జిల్లా కేంద్రంలోనే తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారులకు వినిపించే అవకాశం లభించడంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను భయపడకుండా నేరుగా తెలియజేయవచ్చని,ప్రజల విశ్వాసమే పోలీస్ శాఖకు బలమని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, మార్కాపురం సీఐ సుబ్బారావు, త్రిపురాంతకం సీఐ అసం, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, పొదిలి సీఐ రాజేష్ కుమార్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
