తొలి శుభోదయం మార్కాపురం:-
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలో పలు కారణాల వల్ల ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన సభ్యుల వివరాలు, ఉపాధి, నివాస స్థితి, ప్రభుత్వ పథకాలకు అర్హత వంటి సమగ్ర సమాచారాన్ని యాప్లో నమోదు చేసి ఒకే డేటాబేస్లో పొందుపరచడం ప్రభుత్వ లక్ష్యం.
అయితే, ప్రస్తుత సర్వే ప్రక్రియలో ఓటీపీ సాంకేతిక సమస్యలు, సర్వే సమయంలో ఇంటివారు అందుబాటులో లేకపోవడం, ఒక్కో ఇంటి వద్ద పూర్తి వివరాలు నమోదు చేయడానికి గంటల తరబడి సమయం పట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అదే విధంగా రెవెన్యూ ఉద్యోగులు సర్వేతో పాటు ఇతర రెవెన్యూ విధులు కూడా నిర్వర్తించాల్సి రావడంతో తీవ్ర పనిభారం పెరిగిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్ని కారణాల వల్ల సర్వే పురోగతి మందకొడిగా కొనసాగుతోంది. అనుకున్న స్థాయిలో సర్వే ముందుకు వెళ్లడం లేదు. మంగళ వారం మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులలో సచివాలయం ఉద్యోగస్తులు నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమణ బాబు , సర్వే ప్రాధాన్యతను ఉద్యోగులకు, ప్రజలకు వివరించారు.ఇప్పటివరకు మున్సిపాలిటీలోని 12,943 కుటుంబాలకు గాను కేవలం 1,893 కుటుంబాల సర్వే మాత్రమే పూర్తయ్యిందని సుమారు 14.6% మాత్రమే వెల్లడించారు. ప్రతి ఉద్యోగి సర్వేకు ఇంటికి వెళ్ళినప్పుడు సర్వే యొక్క ప్రాముఖ్యత గురించి ముందుగా తెలియజేయాలి.ప్రజలంతా సర్వేకు సహకరించి తప్పనిసరిగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.