తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పట్టణం బాలుర హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి KPL సీజన్–5 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే కి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు.సభ ప్రారంభంలో ఇటీవల అమరుడైన కానిస్టేబుల్ షేక్ సాజిద్ కి ఘన నివాళులు అర్పిస్తూ,మౌనం పాటించారు. ఈ సందర్భంగా సాజిద్ సేవలను స్మరించుకున్నారు.
తదుపరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ,యువత క్రీడల్లో ముందుకు రావాలంటే సరైన మౌలిక వసతులు తప్పనిసరి. కందుకూరులో క్రీడాకారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అవసరమైతే నా సొంత నిధులతోనే రాబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినం లోపు పూర్తి స్థాయి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. ఇలాంటి రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు యువ ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.ఈ KPL సీజన్–5 టోర్నమెంట్లో మొత్తం 24 జట్లు పాల్గొనడం గమనార్హం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి.ఈ కార్యక్రమంలో KPL టోర్నమెంట్ కమిటీ నిర్వాహకులు షేక్ జలీల్, షేక్ రియాజ్, కె.చిరంజీవి, షేక్ మస్తాన్ వలి, షేక్ నాయబ్ రసూల్, నాగరాజు, సయ్యద్ తాసిన్ క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
