తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఒంగోలుకు చెందిన జిమ్స్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో స్థానిక కోర్టు ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ న్యాయమూర్తి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కంటి ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా నిత్యం పుస్తకాలు, ఫైళ్లతో పని చేసే న్యాయవాదులు మరియు సిబ్బంది కంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం అవసరమని అన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, బార్ అసోసియేషన్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రశంసనీయమన్నారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ, న్యాయవాదులు కేవలం న్యాయ సేవలకే కాకుండా సామాజిక సేవలలో కూడా ముందుండాలని ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు బార్ అసోసియేషన్ కట్టుబడి ఉంటుందని చెప్పారు.
జిమ్స్ కంటి హాస్పిటల్కు చెందిన నిపుణ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలపై సలహాలు అందించారు. కొన్ని కేసుల్లో శస్త్రచికిత్స అవసరమైన వారికి తదుపరి చికిత్సకు మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, జిమ్స్ హాస్పిటల్ నుండి డాక్టర్ నరసింహరావు, పి ఆర్ ఓ రమణ మరియు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మసూద్ ఆలీ, సుభాకర్ పాల్గొన్నారు.
