తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం, పేకాట, కోడి పందాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకొని నగదు మరియు పందాల కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామ శివారు పొలాల్లో, అక్రమంగా కోడి పందాలు నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 3 కోడి పందాల కోళ్లు మరియు రూ.5,740 నగదును స్వాధీనం చేసుకున్నారు.అలాగే ఎస్.ఎన్. పాడు మండలం మంగమూరు గ్రామంలో, అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు దాడి నిర్వహించి 6 మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుంచి రూ.6,360 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఎస్.ఎన్. పాడు పోలీస్ స్టేషన్కు అప్పగించారు.ఇదే విధంగా తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తర్లుపాడు గ్రామ శివారు పొలాల్లో, అక్రమ జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి 5 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి రూ.9,830 నగదును స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూదం, కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తాయని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నివారణలో భాగంగా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి చర్యలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.