తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం నివారణ చర్యలలో భాగంగా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు.మారిపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిలమకూరు గ్రామ పరిధిలో జూదం జరుగుతున్న ప్రాంతంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 4 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.5,280/- నగదును స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా, చిమకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో బోదవాడ గ్రామ శివార్లలో జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు మరో దాడి నిర్వహించగా, అక్కడ జూదం ఆడుతున్న 7 మందిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ.14,450/- నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం వంటి అక్రమ కార్యకలాపాలు సమాజానికి హానికరమని, ఇటువంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠిన చర్యలు తప్పవని సీఐ చిమకుర్తి తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, అక్రమ కార్యకలాపాల నిర్మూలనకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం చర్యలు కొనసాగిస్తారని తెలిపారు.
