తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం కందుకూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రణవి చిన్నపిల్లల, కంటి వైద్యశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కలియదిగిరి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు నవీన్, ప్రశాంతి దంపతులను అభినందించారు. కందుకూరులో ఒక మంచి వసతులతో కూడిన ఆసుపత్రిని అందుబాటులోకి తేవడం గొప్ప విషయమన్నారు. ఇప్పటివరకు చిన్న పిల్లలకు సంబంధించి లేదా కంటి వైద్యానికి సంబంధించి సమస్య వస్తే ఒంగోలు లేదా నెల్లూరుకు వెళ్లేవారని, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అనుభవం ఉన్న డాక్టర్ల పర్యవేక్షణలో ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రజల జేబు చూసి వైద్య సేవలు అందించాలని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎంపీ వేమిరెడ్డి డాక్టర్లకు సూచించారు. అనంతరం పట్టణంలోని తులసి డెంటల్ హాస్పిటల్ను సందర్శించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ప్రముఖ వైద్యులు కోటారెడ్డి కుమారులు డాక్టర్ శివ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.