భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు
ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్పై ప్రత్యేక దృష్టి
ఇతర శాఖల సమన్వయంతో పండగ కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహణ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
తేది:15.02.2026న మహాశివరాత్రి పండుగ సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రముఖ దేవాలయాలు, శైవక్షేత్రాలు వద్ద నిర్వహించే తిరునాళ్ళు, రథోత్సవాలు, ఘాట్లు మరియు తీర ప్రాంతాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలియచేసారు. ప్రముఖ శివాలయాలకు దర్శనానికి, తిరునాళ్ల సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులు మరియు ప్రజలకు ఎటువంటి భద్రతా లేదా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక రూపొందించి, పార్కింగ్ ఏర్పాట్లు సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఆలయ ప్రవేశ మార్గాలు, క్యూ లైన్లు, ఎంట్రీ మరియు ఎగ్జిట్ గేట్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శనార్థం వస్తారు కావున తొక్కేసలాటకు గాని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, అసాంఘిక శక్తులకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు తెలియజేశారు. శివాలయాలు, ఘాట్లు, తీర ప్రాంతాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు, ఎంట్రీ–ఎగ్జిట్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సాంకేతికతను పూర్తిగా వినియోగించుకుంటూ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే దేవాదాయ, రెవిన్యూ శాఖల అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖల సమన్వయం, సహాయ సహకారాలతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పండగ కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తులు పోలీసు శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.పండుగ రోజున ప్రజలు ఏదైనా అనుకోని సంఘటనల గురించి సమాచారం తెలిపేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసుశాఖకు సందర్శకులు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఏమైనా ఉంటే స్థానిక పోలీసు వారికి గాని లేదా 112/100 నంబర్లకు గాని తెలియపరచాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.