తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రముఖ హేతువాద ఉద్యమ నేత, కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ కార్యాలయ ప్రాంగణంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కృష్ణా జిల్లా అంగలూరులోని రైతు కుటుంబంలో జన్మించారని తెలిపారు. తెలుగు సాహిత్యం ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాటం చేసి, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలిచిన మేధావి అని కొనియాడారు. ఆయన రచించిన సూతపురాణం, కురుక్షేత్రం,శంబుక వధ వంటి రచనలు తెలుగు సాహిత్యంలో నూతన ఆలోచనలకు నాంది పలికాయని, పురాణ పాత్రలను హేతుబద్ధంగా విశ్లేషిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారని తెలిపారు. ఆయన పాండిత్యానికి మెచ్చి ప్రజలు ఆయనను ‘కవిరాజు’, ‘అభినవ భారవి’ అని గౌరవంగా పిలుచుకునేవారని గుర్తు చేశారు. లండన్లో బారిస్టర్ చదివినప్పటికీ, కేవలం వృత్తికే పరిమితం కాకుండా సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.