తొలి శుభోదయం కందుకూరు:-
వ్యక్తిగత శుభ్రతతో పాటు, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అలవాటు చేసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్ ను శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. హాస్టల్లో వంటగది, బాత్ రూములు, వ్యర్ధాలు వేరుచేయడం, హాస్టల్ గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. పారిశుధ్యంపై విద్యార్థినులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. హాస్టల్ పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, బాలికలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని వార్డెన్ కు సూచించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు బాలికలతో మాట్లాడుతూ నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక హాస్టల్స్ రూపురేఖలు మార్చారని చెప్పారు. ఆహారం, పుస్తకాలు, కాస్మోటిక్, ఇతర వస్తువులన్నీ సకాలంలో అందిస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం పథకాన్ని కూడా చదువుకునే పిల్లలందరికీ అమలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో… త్వరలోనే కొత్త భవనాన్ని నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. తాత్కాలికంగా నిర్మిస్తున్న భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తరచుగా హాస్టల్ ను సందర్శించి, వసతులు గురించి బాలికలను అడిగి తెలుసుకోవాలని స్థానిక నేతలకు ఎమ్మెల్యే సూచించారు.