తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
నెల్లూరు జిల్లా కోట మండలం శ్యామసుందరకాలనీకి చెందిన చేవూరి చంద్రబాబు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి, వారితో పరిచయం పెంచుకొని బంగారాన్ని కాజేయడం మొదలుపెట్టాడు. మహిళలతో స్నేహం పెంచుకున్నాక… వారిని లాడ్జికి గానీ, వారి ఇంటికే గాని తీసుకువెళ్తాడు. తర్వాత కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి, బంగారాన్ని దోచుకు వెళుతుంటాడు. ఈ క్రమంలో కందుకూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలతో చంద్రబాబుకు పరిచయం ఏర్పడింది. వారిలో ఒకరి దగ్గర నుంచి 85 గ్రాములు, మరొకరి దగ్గర నుంచి 40 గ్రాముల బంగారు వస్తువులు దోచుకుని పారిపోయాడు. మహిళల ఫిర్యాదుతో కందుకూరు పోలీసులు దర్యాప్తు చేసి కిలాడి దొంగను పట్టుకున్నారు. మొత్తం 16 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఇతను గతంలో చిత్తూరు శ్రీకాళహస్తి, కడప, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, నరసరావుపేట ప్రాంతాలలో అనేక దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కొన్ని కేసుల్లో ఇతనికి శిక్ష కూడా పడింది. మరికొన్నిచోట్ల అరెస్ట్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి.