తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జాతీయ రహదారి పై అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతున్నప్పటికీ, గోమాంసం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతూనే ఉంది. నవంబర్ 21వ తేదీ తెల్లవారుజామున జరిగిన సంఘటనలో ప్రయివేట్ ట్రావెల్ బస్ను ఆశ్రయించి భారీగా గోమాంసాన్ని తరలిస్తున్న ముఠాను సింగరాయకొండ పోలీసులు తమ ప్రత్యేక చర్యలతో బస్టు చేసి బయటపెట్టారు.విశాఖపట్నం జిల్లాలో సిద్దం చేసిన గోమాంసాన్ని SVD దేవాంశ్ ట్రావెల్స్ బస్సులో తుని వద్ద పదుల సంఖ్యలో ఐస్బాక్సుల రూపంలో లోడ్ చేసి, బెంగళూరుకు తరలిస్తున్నారని ముందస్తు సమాచారం వచ్చిన నేపథ్యంలో, సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర తన సిబ్బందితో కూడి వాహనాన్ని అడ్డుకుని సమగ్ర తనిఖీ చేశారు. బస్సులో లగేజ్ క్యాబిన్లో లభ్యమైన 11 భారీ ఐస్ బాక్స్లలో 550 కిలోలకు పైగా గోమాంసం లభ్యమైంది.మొదట బస్ డ్రైవర్ గుజ్జుల ప్రేమకుమార్ ఇవి “రొయ్యల బాక్సులు” అని చెప్పి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినా, పోలీసుల వద్ద ఉన్న ఖచ్చితమైన సమాచారం మరియు కఠిన విచారణతో అక్రమ గోమాంస రవాణా నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి సంఘటన స్థలంలో పంచనామా నమోదు చేసి, పాకల పశుసంవర్ధక శాఖ వైద్యుడి సలహా మేరకు గోమాంసం నమూనాలను ఎఫ్ఎస్ఎల్ పరీక్షకు పంపారు.ఎఆర్ 01 డబ్ల్యూ 9299 నంబర్తో నడుస్తున్న ఈ ప్రయివేట్ బస్సులో ఇంత భారీగా గోమాంసం రవాణా చేయడం పశువుల సంరక్షణ చట్టాలకు విరుద్ధమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 204/2025 కింద కేసు నమోదు చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణను వేగవంతం చేస్తున్నారు. గోమాంసం మూలాలు, దీనికి సంబంధించి ఉన్న నెట్వర్క్, ప్రయివేట్ ట్రావెల్స్ ప్రమేయం తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన జాతీయ రహదారిపై నేర నియంత్రణ వ్యవస్థను సవాల్ చేస్తూ, అక్రమ మాంస రవాణాదారుల ధైర్యాన్ని బయటపెట్టింది. ఇకపై ఇటువంటి అక్రమ రవాణాపై తీవ్ర చర్యలు తీసుకుంటామని సింగరాయకొండ పోలీసులు స్పష్టం చేశారు.