తొలి శుభోదయం ప్రకాశం:-
నేర రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసు శాఖ పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఉన్న చెడు నడత కలిగిన వ్యక్తులు, పాత నేరస్థులు మరియు షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు ఆయా వ్యక్తుల జీవనాధారం, కుటుంబ నేపథ్యం, ప్రవర్తన విధానం తదితర అంశాలపై సవివరంగా తెలుసుకున్నారు. భవిష్యత్తులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే లేదా దౌర్జన్యాలకు దిగితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,
“ఎవరైనా నేరాలకు పాల్పడినా లేదా నేరాలను ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం”
“శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లర్లు, గొడవలను ప్రేరేపించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం” అని స్పష్టం చేశారు.ఒక వ్యక్తిపై షీట్ ఉండడం వల్ల అతని వ్యక్తిగత జీవితం, కుటుంబం మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, చెడు నడత ఇమేజ్ నుండి బయటపడాలంటే సత్ప్రవర్తన ఒక్కటే మార్గమని సూచించారు. సమాజంతో కలిసిపోయి, మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని, చట్టబద్ధమైన మార్గంలో జీవనం సాగించాలని వారికి సూచనలు ఇచ్చారు.అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంగ్ చేష్టలు లేదా చట్టాన్ని అతిక్రమించే చర్యలకు పాల్పడినట్లయితే తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం జిల్లా శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడంలో భాగమని తెలిపారు.
