తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లాలోని ఊళ్ళ పాలెం ZP హైస్కూల్కు చెందిన శ్రవర్షిత అనే పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తన ప్రతిభతో అన్ని స్థాయిల్లో పోటీలు గెలుస్తూ ముందుకు సాగుతోంది. చిన్నప్పటి నుంచే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, కష్టపడి విద్యను అభ్యసిస్తున్న ఆమెను ఉపాధ్యాయులు గుర్తించి మండలస్థాయి పోటీలకు పంపించారు.అక్టోబర్ 24న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో శ్రవర్షిత మండలస్థాయిలో వక్తృత్వ పోటీలో ప్రథమ స్థానం, తదుపరి నిర్వహించిన క్విజ్ పోటీలో కూడా ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయాల ఆధారంగా ఆమెను కొండేపి నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.నవంబర్ 4న జరిగిన నియోజకవర్గ పోటీల్లో శ్రవర్షిత వక్తృత్వంలో ద్వితీయ స్థానం సాధించగా, తిరిగి నిర్వహించిన క్విజ్ పోటీలో మరోసారి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ అవకాశంలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులను అమరావతిలో జరగనున్న “రాజ్యాంగ దినోత్సవ విద్యార్థి అసెంబ్లీకి” తీసుకెళ్తామని నిర్వాహకులు స్పష్టంగా ప్రకటించినట్లు శ్రవర్షిత తెలిపింది.
అయితే నిర్ణయ సమయంలో శ్రవర్షితను పక్కనబెట్టి, క్విజ్లో తృతీయ స్థానం పొందిన విద్యార్థిని అసెంబ్లీకి ఎంపిక చేసినట్లు ఆమె పేర్కొంది. తన ప్రతిభను, కృషిని ఇలా నిర్లక్ష్యం చేయడం చాలా బాధ కలిగించిందని ఆమె వివరిస్తోంది. పేద విద్యార్థిని అనే కారణంగా తన హక్కు కోల్పోవద్దని, తనకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మీడియా వర్గాలను ఆమె వేడుకుంటోంది.