తొలి శుభోదయం ఉలవపాడు :-
రామాయపట్నం పోర్టును సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వీరు వచ్చారు. పోర్టు నిర్వహణ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలు, దీని ఆధారంగా చుట్టుపక్కల జరిగే అభివృద్ధి, పోర్టుకు అనుసంధానమైన రోడ్డు, రైలు రవాణా సౌకర్యాల గురించి పోర్టు అధికారులు, భూ సేకరణ అధికారులతో చర్చించారు. ఈ బృందంలో సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ తరఫున ఎకనామిక్ కన్సల్టెంట్ చువా ( రిటైర్డ్ ), సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైస్ తరఫున థాయ్, నిషా, వాణిజ్య – పరిశ్రమల శాఖ తరఫున ఫ్రాన్సిస్ ఉన్నారు. వీరికి జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, ఏపీ మ్యారీ టైం బోర్డు ఈ.ఈ. శివరాం, పోర్టు టెక్నికల్ డైరెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు.