తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్ సేఫ్టీ వారియర్స్ సహకారంతో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాన్ని నియంత్రిత వేగంతో నడపాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని పోలీసులు సూచించారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమ స్వీయ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు.
అలాగే రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం, అధిక వేగం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారి తీస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రోడ్ సేఫ్టీ వారియర్స్, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ తమ కుటుంబాల భద్రతకు తోడ్పడతామని, సమాజంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు.