తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.
ప్రజలకు కావలసిన మేరకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఇంధన కొరత అనే పరిస్థితి ప్రస్తుతం లేదని, సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
అత్యవసర అవసరం లేకపోయినా పెట్రోల్ బంకులకు వెళ్లి ఇంధనం నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా చేయడం వల్ల అవసరమైన వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.
జిల్లా ప్రజలు అపోహలకు లోనుకాకుండా సహకరించాలని, సాధారణంగా వినియోగించే విధంగానే ఇంధనాన్ని వినియోగించాలని కలెక్టర్ సూచించారు.