తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :-
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పురస్కరించుకుని విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేస్తూ గుంపులుగా తిరగకుండా చర్యలు తీసుకున్నారు. అక్రమాలకు తావులేకుండా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించి, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిల్ మరియు ఏఆర్ పోలీస్ బలగాలతో నిరంతర పహారా నిర్వహిస్తున్నారు. “విద్యార్థుల ప్రశాంతతే మా ప్రాధాన్యత” అనే లక్ష్యంతో పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
