తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

దర్శి ప్రకాశం జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్న దర్శి తిరునాళ్ల ఉత్సవాల సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దర్శి సి.ఐ. (CI Darsi) పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది తిరునాళ్ల ప్రాంగణం అంతటా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులను మరియు అనుమానితులను గుర్తించేందుకు FINS (Fingerprint Identification System) పరికరాలను వినియోగిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను ఈ డివైస్‌ల ద్వారా సేకరించి, పోలీస్ డేటాబేస్‌తో క్షణాల్లో సరిపోల్చి వారి నేర చరిత్రను ధృవీకరిస్తున్నారు.దీనితో పాటు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ ఆకాశం నుండి తిరునాళ్ల ప్రాంగణాన్ని, ప్రధాన రహదారులను మరియు పార్కింగ్ ప్రదేశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా రద్దీ పెరిగినా లేదా అవాంఛనీయ కదలికలు కనిపించినా వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. “సాంకేతికతను జోడించి నేరాలను ముందే అరికట్టడమే మా ప్రధాన ఉద్దేశం” అని అధికారులు పేర్కొన్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తులు ఎటువంటి భయాందోళనలు లేకుండా ఉత్సవాలను జరుపుకోవాలని, పోలీసుల తనిఖీలకు సహకరించాలని సి.ఐ. విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *