తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్నీ విభాగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని శాఖలు అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అన్నారు. మంగళవారం గిద్దలూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జల ధార- జలహారతి కార్యక్రమ పనులను వేగవతం చేయాలన్నారు. త్వరిత గతిన పనులను గుర్తించి నియోజకవర్గంలోని 176 చెరువులను జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనులను పూర్తి చేసి వర్షాకాలం నాటికి సిద్ధంగా ఉంచాలన్నారు. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ఇక్కడ అధికంగా ఉన్నాయని, మ్యూటేషన్స్ సరిగా జరగడం లేదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తహసిల్దార్లు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో అందించేందుకు అధికారులు శ్రద్ద వహించాలన్నారు. ఎమ్మెల్యే మత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గంలోని ఆయకట్టు మొత్తానికి నీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా గిద్దలూరు నియోజకవర్గం లో 60 వేల ఎకరాలకు సాగునీరు అందబోతుందని వివరించారు. అదేవిధంగా విద్యుత్ సమస్యలు లేకుండా 11,22 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ల ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఆ గ్రామం వారికే పంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్ఈ అబూతలిం, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, విద్యుత్ శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.