పడకల సంఖ్యను 100 నుంచి 300కు పెంచాలని కోరిన ఎమ్మెల్యే
సానుకూలంగా స్పందించిన CM చంద్రబాబు నాయుడు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సచివాలయంలో కలిశారు. కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల స్థాయిని పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2003లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి హోదాలో 100 పడకల వైద్యశాలగా మార్చిన సంగతిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. మూడు నియోజకవర్గాలకు చెందిన రోగులు ఏరియా వైద్యశాలకు వస్తున్నారని, పెరిగిన జనాభా దృష్ట్యా… ఆసుపత్రి స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు. పడకల సంఖ్యను 300 కు పెంచాలని కోరారు. అలాగే పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న కందుకూరు ప్రాంతానికి, ప్రస్తుతం వైద్యశాలలో సదుపాయాలు సరిపోవటం లేదని, పడకలతో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కి అందించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, త్వరలోనే ఆసుపత్రి స్థాయిని పెంచేలా సహకారం అందిస్తానని నిర్ణయం ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.