ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డిఎస్ బీవీ స్వామి
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం, :
సంగమేశ్వరం రిజర్వాయర్ నిర్మాణ పనుల కోసం రూ.166.40 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామం సంగమేశ్వర దేవాలయం సమీపంలో పాలేరు నదిపై రిజర్వాయర్ నిర్మాణ పనుల కోసం సాస్కి నిధులు రూ.166.40 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడుకి మంత్రి డిఎస్ బీవీ స్వామి పత్రిక ప్రకటలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డీఎస్ బీవీ స్వామి మాట్లాడుతూ…సంగమేశ్వరం రిజర్వాయర్ ద్వారా కొండపి నియోజకవర్గంలో 9500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 60 గ్రామాలకు త్రాగునీరు అందుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2026 – 27 బడ్జెట్ లో ఈ రిజర్వాయర్ కి రూ. 25 కోట్లు కేటాయించిందని వైసిపి హయాంలో ఈ రిజర్వాయర్ ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో రిజర్వాయర్ ను పూర్తి చేసి కొండపి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.