తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న న్యాయవాది బక్కముంతల వెంకటేశ్వర్లు న్యాయవాద వృత్తిలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, బక్కముంతల వెంకటేశ్వర్లు అభ్యుదయ భావాలు కలిగిన ప్రజా న్యాయవాదిగా సమాజంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన చిన్నప్పటి నుంచే సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించుకొని, మూడవ తరగతి నుంచే సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చేరి చదువులు అభ్యసించారు. అనంతరం తన విద్యాభ్యాసాన్ని ఎక్కువగా ప్రభుత్వ హాస్టళ్లలోనే పూర్తి చేసి సమాజాన్ని దగ్గరగా అర్థం చేసుకున్నారు.
రాజకీయాలకు అతీతంగా ఉంటూ, పేద ప్రజలకు అందుబాటులో ఉండే న్యాయవాదిగా సేవలందిస్తూ అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ న్యాయాన్ని అందిస్తున్నారు. అలాగే కందుకూరు కోర్టులో గత 22 సంవత్సరాలుగా లోక్ అదాలత్ న్యాయవాదిగా సేవలందిస్తున్నారు.లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కందుకూరు, కొండేపి నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుల్లో పాల్గొని ప్రజలకు న్యాయ అవగాహన కల్పించారు. విద్యార్థి దశలో పి డి ఎస్ యు విద్యార్థి సంఘంలో పనిచేసి సామాజిక స్పృహతో ముందుకు సాగారు.సింగరాయకొండ మరియు పరిసర ప్రాంతాలలో ఆయన పేరు తెలియని వారు లేరని పలువురు న్యాయవాదులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్లు పాల్గొని బక్కముంతల వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
