తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అత్యధికంగా డీఎస్సీ నియామకాలు నిర్వహించి వేలాది మంది నిరుద్యోగులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన విషయాన్ని తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన రాంబాబు, ప్రధాన కార్యదర్శి యనమల ఆంజనేయులు మాట్లాడుతూ గుర్తుచేశారు. గత సంవత్సరం భర్తీ చేసిన సుమారు 16,347 టీచర్ పోస్టులు విద్యా వ్యవస్థ బలోపేతానికి దోహదపడ్డాయని తెలిపారు.
ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో మరోసారి ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం ముందడుగు వేస్తూ, జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారు 10,060 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టడం హర్షణీయమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు స్పష్టత కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించడం ద్వారా విద్యా వ్యవస్థలో ఖాళీలను తగ్గిస్తూ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవడం సంతోషకరమని ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. ఈ నియామకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ లోటు తగ్గి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందే పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు.
ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత ప్రభుత్వం కల్పించిన ఈ విలువైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలకు సమగ్రంగా సిద్ధమవ్వాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *