తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
కార్మిక లోకానికి అండగా ఉంటూ, వారి హక్కుల పోరాటంలో నిరంతరం శ్రమించే సీఐటీయు మార్కాపురం జిల్లా కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ ఎన్నికల్లో మార్కాపురం జిల్లా తొలి సీఐటీయు అధక్షునిగా గిద్దలూరుకి చెందిన తొలుచూరి ఆవులయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన మార్కాపురం జిల్లా ప్లీనంలో సీఐటీయు నాయకులందరూ ఏకగ్రీవంగా ఆవులయ్య పేరును ప్రతిపాదించగా, ప్లీనంలోని వారందరూ పూర్తి మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా ఆవులయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై, పనిచేసే కూలీల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తానని ప్రకటించారు. జిల్లా పరిధిలోని కార్మికులందరినీ ఏకం చేసి, సీఐటీయును బలోపేతం చేయడమే తన ప్రథమ లక్ష్యమని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత మొదటి అధ్యక్షునిగా ఎన్నికైన ఆవులయ్యకు పలువురు కార్మిక నేతలు, ప్రజా సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన కార్మిక నాయకులు, సీఐటీయు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.