పోలీస్ సిబ్బంది సంక్షేమం దృష్ట్యా క్రికెట్ పిచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ గ్రౌండ్లో ఆధునిక సౌకర్యాలతో క్రికెట్ పిచ్ను ఏర్పాటు చేయటం జరిగింది.ఈ క్రికెట్ పిచ్ను సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., ప్రారంభించారు. ఎస్పీ స్వయంగా బ్యాటింగ్ చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమం ద్వారా సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడంతో పాటు, పరస్పర సహకార భావనను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విధులు క్లిష్ట స్వభావం కలిగినవిగా ఉండి, అనేక సందర్భాల్లో ఒత్తిడిమయ పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుందని, ఆహారం కూడా సమయానికి తీసుకోలేని పరిస్థితులు ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరమన్నారు. వ్యాయామం, యోగా మరియు క్రికెట్ వంటి క్రీడల్లో నిరంతరం పాల్గొనడం వల్ల శరీరం దృఢంగా మారడమే కాకుండా, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అన్నారు. క్రీడలు పోలీస్ సిబ్బందిలో టీమ్ స్పిరిట్ను పెంపొందించడంతో పాటు, విధుల్లో మరింత చురుకుదనాన్ని కలిగిస్తాయని ఎస్పీ గారు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరన్నారు. క్రికెట్ పిచ్ ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐ లు రమణారెడ్డి,సీతారామిరెడ్డి, ఆర్ఎస్సైలు ప్రసాద్, మాల్యాద్రి, అస్లాం, తిరుపతి స్వామి,క్రికెట్ గ్రౌండ్ క్యూ రేటర్ బోడవరపు శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
