తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పునాయుడుపాలెం,:-
సీఎం.ఆర్.ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ.58.47 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యం, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస అవసరమైన సూది, దూది కూడా అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు “సంజీవని” పథకం ద్వారా ప్రజల హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజేషన్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.